పోయెస్ గార్డెన్‌లో అర్థరాత్రి ఐటీ సోదాలు.. జయలలిత వ్యక్తిగత గదుల్లో...

శనివారం, 18 నవంబరు 2017 (08:46 IST)
శశికళ వర్గీయులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు చెందిన 188 ఆస్తులపై ఐటీశాఖ ఇటీవల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సేకరించిన సమాచారంతో దివంగత జయలలితకు చెందిన చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌‌లో ఐటీ దాడులు జరిగాయి. 
 
వేద నిలయంలో శుక్రవారం అర్థరాత్రి ప్రాంతంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకునే ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడులకు ముందు శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జయ టీవీ సీఈవో వివేక్‌‌కు ఫోన్‌ చేసి, వేద నిలయం తాళాలు తీసుకుని రావాలని సూచించారు. 
 
దీంతో ఈ వ్యవహారం శశికళ వర్గం అనుచరులకు తెలిసి, పెద్ద ఎత్తున అక్కడ గుమికూడి, ఐటీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సాయంతో వారిని దాటుకుని వెళ్లిన అధికారులు జయలలిత, శశికళ వ్యక్తిగత గదులతో పాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శి పూంగ్రునన్ గదులలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి ఒక ల్యాప్‌ టాప్, నాలుగు పెన్‌ డ్రైవ్‌‌లు స్వాధీనం చేసుకున్నారు.
 
కాగా, ఈ దాడులపై అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఘోర అవమానం జరిగిందని, అమ్మ ఆత్మక్షోభిస్తుందన్నారు. అయితే పోయెస్ గార్డెన్‌లో దాడులను తమిళనాడు సీఎం పళనిసామితో పాటు ఓపీఎస్ తీవ్రంగా ఖండించారు. ఇంకా అన్నాడీఎంకే కార్యకర్తలు ఐటీ దాడులకు వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు