78 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్.. కానీ మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే?

గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:22 IST)
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1409 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,393కు చేరిందని ఆయన తెలిపారు. 
 
రెండు వారాలుగా 78 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. గడిచిన 28 రోజులుగా 12 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇప్పటి వరకు 5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 30 రోజుల లాక్‌డౌన్‌ను ప్రజలు స్ఫూర్తివంతంగా పాటించారని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. మే 3 తర్వాత పరిస్థితి ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ప్రామాణిక వ్యవస్థల హెచ్చరికల ప్రకారం కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముంది. ఇయాన్ లిప్కిన్ లాంటి ప్రముఖ సైంటిస్టులైతే.. విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టేదాకా మామూలు పరిస్థితి రాబోదని తేల్చేశారు.
 
జనాభా పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో.. అదికూడా ఆరోగ్య రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నవేళ.. వైరస్ కంట్రోల్ లోకి రాకముందే లాక్ డౌన్ ఎత్తేస్తే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఎకనమిస్టులు చెబుతున్నారు. 
 
ముందుగా పేదలకు తిండిగింజలు పంచి, తలారూ.7500 ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయంపైనే దేశ ప్రజలను ఆకలి నుంచి కరోనా నుంచి కాపాడే అవకాశం వున్నట్లు నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు