కరోనా పరీక్షలు చేయించుకోమన్నందుకు ఎస్ఐ తల పగిలింది.. ఎక్కడ?

గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:08 IST)
ఇతర ప్రాంతాల నుంచి తమ సొంతూళ్ళకు వచ్చే వారికి స్థానిక వైద్య శాఖ అధికారులు విధిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు సాఫీగానే సాగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కొందరు మూర్ఖులు పరీక్షలు చేయించుకోమని కోరినందుకు వైద్య సిబ్బందితో పాటు.. వారి వెంట వెళ్లే పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ గ్రామానికి వచ్చిన యువకుడిని కరోనా పరీక్షలు చేసుకోవాలని ఓ ఎస్ఐ కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు ఏఎస్ఐ తల పగులగొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షోపూర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షోపూర్‌ జిల్లాలోని గాస్వాని గ్రామానికి చెందిన గోపాల్‌ శివ్‌హరే (21) అనే యువకుడు ఇటీవల ఇండోర్‌ నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా వెలుగు చూసిన నగరంగా ఇండోర్ గుర్తింపుపొందింది. ఇండోర్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఇండోర్ నుంచి స్వగ్రామానికి రావడంతో స్థానికులు ఆందోళన చెందసాగారు. పైగా, ఈ విషయం తెలిసిన స్థానిక వైద్యబృందం గోపాల్‌ ఇంటికెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరింది. అయితే, గోపాల్‌ బాగానే ఉన్నాడనీ, ఎలాంటి పరీక్షలు  అవసరం లేదంటూ అతని కుటుంబసభ్యులు వైద్య బృందంపై దాడికి దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గోపాల్‌ ఇంటికెళ్లి నచ్చచెప్పినా వినలేదు. ఖచ్చితంగా పరీక్షలు చేసుకోవాల్సిందేనన్న పోలీసులపై గోపాల్‌ కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏఎస్‌ఐ శ్రీరామ్‌ అవస్థి (52) తలకు తీవ్ర గాయమైంది. గోపాల్‌ కుటుంబపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు