రాజకీయ అరంగేట్రంలో కంగనా సక్సెస్? భారీ మెజార్టీతో గెలుపు ఖాయమా?

ఠాగూర్

ఆదివారం, 2 జూన్ 2024 (12:23 IST)
సినీ నటి, ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన రాజకీయ అరంగేట్రంలో అదరగొట్టారు. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆమె భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన విక్రమాదిత్య సింగ్‌పై ఆమె పైచేయి సాధించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నట్టు ఈ ముందస్తు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 
 
నిజానికి మండి లోక్‌సభ స్థానం సుధీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ 2014 ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గింది. ఆ ఎన్నికల్లో మండి ఓటర్లు బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్‌ శర్మకు జైకొట్టారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రతిభా సింగ్‌పై 39 వేల ఓట్ల మెజార్టీతో రామ్ స్పరూప్ శర్మ గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామ్ స్వరూప్ మరోమారు విజయం సాధించారు.
 
అయితే, 2021లో సిట్టింగ్ ఎంపీ అకాల మరణంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రతిభా సింగ్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మండి స్థానం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. తాజా ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమాధిత్య సింగ్ పోటీ చేశారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికి అంతిమంగా కంగనా రనౌత్ విజయభేరీ మోగిస్తారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు