కాపీ కొట్టకుండా... తలకు అట్టపెట్టలు తగిలించి పరీక్ష రాయించారు.. ఎక్కడ?

శనివారం, 19 అక్టోబరు 2019 (15:00 IST)
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కాపీ కొట్టేందుకు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. దీంతో కాపీయింగ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా ఆ విశ్వవిద్యాలయ అధికారులు వినూత్నంగా నడుచుకున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ తలలకు అట్టపెట్టెలు తగిలించి పరీక్షలు రాయించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని హవేరీలో భగత్ ప్రీ యూనివర్సిటీ కాలేజిలో విద్యార్ధులు తరగతి గదిలో కూర్చుని, తలలకు అట్టపెట్టెలతో పరీక్షలు రాస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కళ్లు మాత్రమే కనిపించేలా అట్టపెట్టెలకు రంధ్రాలు చేసినట్టు సమాచారం. అయితే విద్యార్ధులకు ఊపిరాడకుండా చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ కాలేజి యాజమాన్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ వ్యవహారంపై కర్నాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్. సురేశ్ స్పందించారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 'ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. విద్యార్ధులను జంతువుల మాదిరిగా చూస్తున్నారు. ఇలా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం' అని ఆయన ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు