కరోనా స్ట్రెయిన్ : కర్నాటకలో నైట్ కర్ఫ్యూ - మహారాష్ట్రలో కూడా...

బుధవారం, 23 డిశెంబరు 2020 (15:15 IST)
కరోనా కొత్త రూపాంతరం స్ట్రెయిన్‌తో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్నాటకలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, బ్రిటన్ నుంచి వారిలో 25 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి భారత్‌కు 1,500 మంది వచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించనుంది. 
 
కాగా, ఇప్పటికే మహారాష్ట్రలో కర్ఫ్యూ విధించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో డిసెంబర్-22 నుంచి జనవరి-5 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. 15 రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని అధికారులు తెలిపారు.
 
అంతేకాకుండా, బ్రిటన్‌లో పుట్టిన కరోనా 'న్యూ వెర్షన్' విజృంభణ నేపథ్యంలోనే ముందుజాగ్రత్తగా మహా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై భారత్ తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెల్సిందే. డిసెంబర్‌ 31 వరకు అన్ని విమాన సర్వీసులపై నిషేధం విధించింది. రేపు అర్థరాత్రి నుంచి నిషేధం అమలులోకి రానుంది. 
 
ప్ర‌స్తుతం యూకే నుంచి వ‌స్తున్న విమానాల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు కేంద్ర విమాన‌యాన శాఖ తెలిపింది. ఇప్ప‌టికే యూకే నుంచి బ‌య‌లుదేరిన విమానాలు లేదా డిసెంబ‌ర్ 22, 2020 రాత్రి 11.59 గంట‌ల‌లోపు వ‌చ్చే విమానాల్లో ప్ర‌యాణికుల‌కు ఈ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. 
 
అలాగే, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిచేసింది. కాగా, డిసెంబరు 22వ తేదీలోపు సుమారు వెయ్యి మంది ప్రయాణికులు ఆయా దేశాల నుంచి ముంబైకు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వీరందరికీ ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌ను తప్పనిసరిచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు