లాక్‌డౌన్‌లో వాహనాలు సీజ్ చేస్తే ఇక తిరిగి ఇవ్వరు : తెలంగాణ పోలీసులు

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మే ఏడో తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ను పొడగించింది. పైగా, ఈ నెల 21వ తేదీ నుంచి లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఈ కఠిన ఆంక్షల్లో భాగంగా, లాక్‌డౌన్ సమయంలో వాహనాలను సీజ్ చేస్తే ఇకపై తిరిగి ఇవ్వబోరని తెలంగాణ పోలీసులు తేల్చి చెబుతున్నారు. 
 
ఇదే అంశంపై డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్‌డౌన్‌ అమలుపై చర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 
 
సోమవారం తీసుకున్న నిర్ణయాలను 21 నుంచి పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చాం. అవసరం లేకున్నా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తించాం. వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్ష చేయాలని నిర్ణయించాం. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 
 
పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తామన్నారు. కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు కొనసాగుతాయి. నిత్యవసరాల కొనుగోలుకు 3 కిలోమీటర్ల లోపు మాత్రమే వెళ్లాలి. వాహనదారులు రెసిడెన్స్‌ ప్రూఫ్‌తోనే బయటకు రావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు పాసులు ఇస్తామన్నారు. కలర్‌ కోడ్‌ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు. 
 
ఇకపోతే, సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలి. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు వెంట తీసుకురావాలి. ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్ ప్రూఫ్స్ తీసుకురావాలని డీజీపీ సూచించారు. రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలని. ఇళ్లల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు