భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త.. తర్వాత భయంతో ఆత్మహత్య!!

ఠాగూర్

శనివారం, 3 మే 2025 (10:22 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. భార్యను చంపిన భర్త శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. ఆ తర్వాత భయంతో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బర్వాహా పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మణ్ (45), రుక్మిణీ బాయి (410) అనే దంపతులు ఉంటున్నారు. వీరి ఇంటి నుంచి కొన్ని రోజులుగా తీవ్ర దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల వారు ఇంటికి వెళ్లి చూడగా తలుపులు మూసివున్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా షాక్‌కు గురయ్యారు. 
 
మంచంపై లక్ష్మణ్ విగతజీవిగపడివుండటాన్ని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదేసమయంలో మంచానికి సమీపంలో తవ్విన గోతిలో పాక్షికంగా పాతిపెట్టిన రుక్మిణీ బాయి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలికి చేరుకుని రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
రుక్మిణి మృతదేహం మాత్రం పాక్షకంగా కుళ్లిపోయి ఉంది. దీంతో హత్య జరిగి నాలుగైదు రోజులై అయివుంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని సరిగా పూడ్చక పోవడం వల్లే దాని నుంచి దుర్వాసన వ్యాపించిందని పోలీసులు తెలిపారు. భార్యను చంపి పాతిపెట్టిన భర్త.. నాలుగైదు రోజులుగా అదే మంచంపై నిద్రపోయినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. 
 
భార్య హత్య విషయం బయటపడి, తాను పట్టుబడతాననే భయంతో లక్ష్మణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు సంబంధించి స్పష్టమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు