వేసవి లోపు ఒక్క మావోయిస్టు ఉండటానికి వీల్లేదు : అమిత్ షా

సోమవారం, 9 నవంబరు 2020 (10:46 IST)
ప్రగతి విఘాతకులుగా ముద్రపడిన మావోయిస్టులను పూర్తిగా ఏరివేసే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిశితంగా దృష్టిసారించారు. ఇందులోభాగంగా, వచ్చ యేడాది వేసవి లోపు దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, మావోయిస్టుల అంతానికి దేశంలో చేపడుతున్న ఆపరేషన్లపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'సమస్య ఏంటి.. ఎక్కడ, ఎందుకు ఉంది' అని గత నెలలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. 
 
సమస్య కేంద్ర భద్రతా దళాలైన 'కోబ్రా' నుంచి ఉందా? రాష్ట్ర దళాల నుంచి ఉందా? అనే విషయంపై లోతైన విచారణ జరపాలని ఆదేశించారు. వచ్చే ఏడాది వేసవిలోపు బిహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్రలో మావోయిస్టులు లేకుండా చేయాలని స్పష్టమైన టార్గెట్‌ ఇచ్చారని ఓ సీఆర్‌పీఎఫ్‌ అధికారి తెలిపారు. 
 
దీంతో వచ్చే ఏడాది జూన్‌లోపు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా 'ప్రహార్‌-3'ను భద్రతా దళాలు ప్రకటించాయి. మరోవైపు నక్సలైట్ల ఏరివేతకు కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాలు కలిసి పనిచేయాలని అమిత్‌ షా ఆదేశించారు. హెలికాప్టర్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం కోట్లాది రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు