నగరాల్లో వలస కార్మికుల కోసం అద్దె ఇళ్ల సముదాయాలు

గురువారం, 18 మార్చి 2021 (12:23 IST)
వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అద్దె ఇళ్ళ సముదాయాలు నిర్మించే పథకాన్ని ప్రారంభించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో వెల్లడించారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కార్మికులతోపాటు వీధుల్లో విక్రయాలు జరిపేవారు, రిక్షా కార్మికులు, సేవ రంగంలో పని చేసే కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మార్కెట్లు, వాణిజ్య సంస్థల్లు, విద్యా, ఆరోగ్య, హోటల్ రంగాలలో పని చేస్తున్న వారంతా ఈ పథకం కింద లబ్ది పొందుతారని చెప్పారు.
 
అద్దె ఇళ్ళ సముదాయాల్లో నివసించే కార్మికులకు వాటిని నిర్వహించే యజమానులకు మధ్య కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఒప్పందం చేసుకోవలసి ఉంటుందని మంత్రి తెలిపారు. అద్దె గృహ సముదాయలలో వాటి నిర్వహణ బాధ్యతలు చూసే ఏజెన్సీ షరతుల మేరకు వసతి అలాట్‌మెంట్‌ జరుగుతుంది. అద్దె గృహ సముదాయాలు నిర్మించే కంపెనీ స్థానిక పరిశ్రమలు, సర్వీసు ప్రొవైడర్లు, ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకోవలసిందిగా ప్రభుత్వం సూచించినట్లు చెప్పారు. 
 
దీని వలన అద్దె వసూళ్ళలో అవరోధాలు నివారించే అవకాశం ఉంది. ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చేకార్మికులు కోసం చౌకగా అద్దె వసతి కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని రెండు మోడళ్ళుగా చేపట్టనున్నారు. 
 
మొదటిది... జేఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకాల కింద ప్రభుత్వ నిధులతో నిర్మించి సిద్ధంగా ఉన్న నివాసాలను 25 ఏళ్ళపాటు అద్దె గృహ సముదాయాల కింద మార్చడం. సొంతంగా భూమి కలిగి ఉండి వాటిలో గృహ సముదాయాలు నిర్మించి, నిర్వహించడానికి ఆసక్తి కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం రెండో మోడల్ అని మంత్రి తెలిపారు. 
 
రెండో మోడల్‌ గృహ సముదాయాల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన్‌ - అర్బన్‌ పథకం కింద నిధులను సమకూర్చనున్నట్లు మంత్రి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు