పళని స్వామి నన్ను చూసి నవ్వకు.. నవ్వితే నీ పనైపోద్ది.. స్టాలిన్ సలహా.. జయలలితను కూడా ప్రశ్నిస్తారా?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (15:23 IST)
మాజీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే నేత స్టాలిన్ నవ్వుతూ పలకరించుకోవడంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మండిపడ్డారు. స్టాలిన్-పన్నీర్ కుమ్మక్కయ్యారనేందుకు ఇదే నిదర్శనమని కూడా ఆరోపణలు చేశారు. అంతేగాకుండా.. పన్నీర్ కాన్వాయ్ వెళ్తుంటే.. స్టాలిన్ ఆగి మరీ పన్నీరుకు దారి ఇవ్వడం వంటి కార్యాలతోనే పన్నీరును అకస్మాత్తుగా సీఎం పదవి నుంచి శశికళ దించేయడానికి కారణమని కూడా అన్నాడీఎంకే వర్గాల సమాచారం. 
 
కానీ శశికళ మాటలకు ఎదుటి మనిషిని నవ్వుతూ పలకరించడమనేది మానవ నైజమనీ.. మనుషులకు, జంతువులకు తేడా అదేనని పన్నీర్ పేర్కొన్నారు. స్టాలిన్ కూడా శశికళకు అంతే స్థాయిలో సమాధానం చెప్పారు. అసెంబ్లీలో తనను చూసి జయలలిత నవ్వేవారనీ.. ఆమెను కూడా శశికళ ప్రశ్నిస్తారా అని కౌంటరిచ్చారు. పళని స్వామి రిమోట్ కంట్రోలింగ్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు.
 
ఈ నేపథ్యంలో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీఎం పళనిస్వామికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సలహా ఇచ్చారు. అసెంబ్లీలో తనను చూసి నవ్వొద్దన్నారు. అలా నవ్వితే చిన్నమ్మ వద్ద పళని స్వామి పనైపోతుందని వెటకారంగా అన్నారు.  శనివారం ముఖ్యమంత్రి బలపరీక్ష కోసం తమిళనాడు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే-అన్నాడీఎంకే నేతలు నవ్వుకుంటూ పలకరించుకుంటారో లేకుంటే కారాలు మిరియాలు నూరుకుంటారో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి