ప్రజలంతా ఐకమత్యంతో జీవిస్తున్నారు.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు : మణిపూర్ సీఎం బీరేన్ సింగ్

బుధవారం, 26 జులై 2023 (14:56 IST)
తమ రాష్ట్ర ప్రజలంతా ఐకమత్యంతో జీవిస్తున్నారని, అందువల్ల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్పష్టం చేశారు. ఒకవేళ తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం సీఎం బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పారు. గత కొన్ని నెలలుగా మణిపూర్ రెండు జాతి వైషమ్యాలతో రగిలిపోతుంది. మైతేయిలు, కుకీ జాతుల మధ్య ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. మైనార్టీ తెగ కుకీలపై మెజార్టీ సంఖ్యా బలం కలిగిన మైతేయిలు దారుణాతి దారుణాలకు పాల్పడుతున్నారు. 
 
గత రెండు మూడు నెలులుగా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. కుకీ తెగకు చెందిన మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కాల్చి చంపేస్తున్నారు. నగ్నంగా ఊరేగిస్తున్నారు. మణిపూర్ ప్రభుత్వం వీటిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. పైగా, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు సైతం రెండుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజీకీయ పార్టీ కార్యకర్తను. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్నారు. పార్టీ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించే విధేయతగల కార్యకర్తనని చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే మాత్రం ఈ పదవి నుంచి తప్పుకుంటానని వివరించారు. 
 
మణిపూర్‌లో హింస, అల్లర్లకు అక్రమంగా వలస వచ్చిన వారేనని చెప్పారు. రాష్ట్రంలోని మైతేయులు, కుకీ తెగలతో పాటు 34 తెగలకు చెందిన ప్రజలు ఎంతో ఐకమత్యంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆయన తెలిపారు. మే 3వ తేదీన జరిగిన గిరిజన ర్యాలీ వల్లే రాష్ట్రంలో హించ చెలరేగిందని, డ్రగ్ స్మగ్లర్లు కూడా ఈ అల్లర్లకు కారణమని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు