ఆ రహదారుల్లో పాదచారులు నడవరాదు.. సుప్రీంకోర్టు

మంగళవారం, 21 నవంబరు 2023 (16:59 IST)
దేశ రాజధాని ప్రాంతంలో వాహనాల రాకపోకలకు కోసం ప్రత్యేకంగా నిర్ధేశించిన హైవేలపై పాదచారాలు తిరగొద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఈ మేరకు పాదాచారులకు కూడా క్రమశిక్షణ అవసరమని పేర్కొంది. హైవేలపై పాదచారుల భద్రత అంశాన్ని లేవనెత్తుతూ ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణ స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు పై విధంగా సూచనలు చేసింది. 
 
తొలుత ఇదే అంశంపై పిటిషనర్లు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. పైగా, ఈ వ్యవహారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖను సంప్రదించాలని సూచించింది. దీంతో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పరిశీలించింది. 
 
'అసలు హైవేపైకి పాదచారులు ఎలా వస్తారు? వారికి క్రమశిక్షణ ఉండాలి. వారు హైవేలపై తిరగకూడదు. ప్రపంచంలో ఎక్కడా ఇలా తిరిగే వ్యక్తులు కనిపించరు. భవిష్యత్తులో పాదచారుల కోసం హైవేలపై వాహనాలను ఆపాలని కూడా కోరతారు. అదెలా సాధ్యం?' అని పిటిషన్‌‌దారులను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారిని కోర్టు ఎలా సమర్థించగలదు? అని తెలిపింది.
 
హైవేలపై పాదచారులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయని పిటిషన్‌దారుల తరపు న్యాయవాది వాదించగా.. పాదచారులు ఉండకూడని చోట ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 'దేశంలో హైవేలు పెరిగాయి. కానీ, మనలో క్రమశిక్షణ పెరగలేదు' అని వ్యాఖ్యానించింది. 'ఇది పూర్తిగా అసంబద్ధ పిటిషన్. వాస్తవానికి దీనికి జరిమానా విధించాల్సింది. ఏదేమైనా.. సంబంధిత మంత్రిత్వ శాఖను సంప్రదించేందుకు హైకోర్టు మీకో అవకాశం ఇచ్చింది' అని పిటిషన్‌దారులను ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు