ముంబైలో భారీ వర్షాలు.. బైక్‌పై వెళ్తూ యువతి కిందపడిపోయింది.. ఇంతలో?

సోమవారం, 9 జులై 2018 (16:12 IST)
దేశ ఆర్థిక నగరం ముంబైలో కురిసిన భారీ వర్షాలతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ముంబై కల్యాణ్ నగర్‌లో భారీ వర్షం పడుతుండగా, బైక్‌పై వెళ్తున్న ఓ జంట ప్రమాదానికి గురైంది. వర్షపు నీటి కారణంగా రోడ్డుపై వున్న గొయ్యి కనిపించకపోవడంతో బైక్ స్కిడ్ అయ్యింది. అంతే బస్సు కిందకు పోయింది.


ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న ఓ యువతి చక్రాల కింద నలిగిపోయింది. సమీపంలో ఉన్న ఓ దుకాణం సీసీటీవీల్లో ఈ ఘటన రికార్డు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
రోడ్డు ప్రమాదానికి గురైన యువతి థానే ప్రాంతంలోని ఓ స్కూలులో పనిచేస్తున్న మనీషా బోయిర్‌గా గుర్తించారు. ఈ వీడియోలో తన బంధువు బైక్ నడుపుతూ ఉంటే, ఆమె వెనుక కూర్చుని వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకుని వుంది. వారి వాహనం శివాజీ చౌక్ వద్దకు రాగానే, గుంతలో పడింది. ఆపై వీరిద్దరూ కుడివైపునకు పడిపోయారు.
 
అదే సమయంలో అటుగా వస్తున్న బస్సు వెనుక చక్రాల కింద మనీషా చిక్కుకుపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే తీవ్రగాయాలతో మనీషా ప్రాణాలు కోల్పోయింది. ముంబైలో శనివారం నుంచి రికార్డు స్థాయిలో వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు