మద్యం షాపులు తెరిచారు, పూటుగా తాగొచ్చి కొడుకుని పొట్టనబెట్టుకున్నాడు

బుధవారం, 13 మే 2020 (17:40 IST)
మద్యం త్రాగి వచ్చి గొడవ చేస్తుండగా అడ్డు పడినందుకు కొడుకుని చంపేశాడు ఓ తండ్రి. రోజూ మద్యం త్రాగి వస్తుండటంతో భార్య నిలదీసింది, దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదంతా చూసి భరించలేని కొడుకు తండ్రికి అడ్డుపడటంతో తుపాకీతో కాల్చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. ఆ వ్యక్తి ఇప్పుడు కొడుకుని పొట్టనబెట్టుకోవడమే కాక 33 ఏళ్ల క్రితం కన్నతల్లిని చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని రోహినీ ఏరియాకు చెందిన ఓమ్‌పాల్‌ వ్యాపారస్తుడు. చాలాఏళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యుల మాటలను పెడచెవిన పెట్టి తీరు మార్చుకోలేదు. మందలించినందుకు 33 ఏళ్ల క్రితం 1987లో తల్లిని చంపి జైలు శిక్ష అనుభవించాడు. అయినా పద్ధతి మార్చుకోకుండా త్రాగి వచ్చి భార్య పవిత్రా దేవితో గొడవపడేవాడు. లాక్‌డౌన్ కారణంగా కొద్దిరోజుల పాటు వైన్‌షాపులు మూత పడటంతో ఓమ్‌పాల్ ప్రశాంతంగా ఉన్నాడు. 
 
కొద్దిరోజుల నుంచి మద్యం విక్రయాలు మళ్లీ మొదలు కావడంతో ఇష్టం వచ్చినట్లు తాగి కుటుంబీకులను ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. మంగళవారం మద్యం సేవించి వచ్చిన ఓమ్‌పాల్‌ను భార్య నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వారి గొడవతో విసిగిపోయిన కొడుకు మధ్యలో వచ్చి తండ్రితో వాదనకు దిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఓమ్‌పాల్ గదిలో ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో కొడుకును కాల్చి చంపాడు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకుని, ఓమ్‌పాల్‌ని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు