కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!!

వరుణ్

శుక్రవారం, 14 జూన్ 2024 (08:40 IST)
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నమోదైవున్న పోక్సో చట్టం కేసులో బెంగుళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కర్నాటక సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈ యేడాది ఫిబ్రవరి 2వ తేదీన యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్‌ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం డీజీపీ అలోక్‌ మోహన్‌ ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. 
 
కాగా, బాధిత బాలిక తల్లి గత నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కేసులో చార్జిషీట్‌ను ఈనెల 15వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉన్నందున సీఐడీ అధికారులు యడియూరప్పకు నోటీసులు జారీ చేయగా, ఈనెల 17న విచారణకు హాజరువుతానని యడియూరప్ప సమాచారం పంపారు. 
 
అయితే, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన యడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేసును విచారిస్తున్న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి రమేశ్‌ గురువారం యడియూరప్పపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. కాగా, పోక్సో కేసులో అవసరమైతే యడియూరప్పను సీఐడీ విభాగం అరెస్టు చేసే అవకాశం ఉందని హోంమంత్రి పరమేశ్వర్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు