బెంగాల్‌లో మోడీ హవా పనిచేయదు.. దీదీదే విజయం : పీకే

మంగళవారం, 30 మార్చి 2021 (13:11 IST)
దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఒకటి. ఇప్పటికే తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. రెండో దశ కోసం ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రంమలో పశ్చిమ బెంగాల్‌ రాజకీయ పరిస్థితిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ప్రముఖ పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి ప్రాచుర్యం ఉన్నప్పటికీ..  బెంగాల్‌లో మాత్రం దీదీకే తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మమత, మోడీల మధ్య పోరాటంగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రెండంకెల స్థానాలు దాటడం కష్టమని అంచనా వేశారు. ఒకవేళ తన అంచనాలు తప్పితే..  రాజకీయాలకు పూర్తిగా దూరమవుతానని పునరుద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గుచూపినప్పటికీ.. ఇక్కడి ఎస్సీ ఓటర్లు.. ఈసారి తృణమూల్‌కే ఓటేస్తారని ధీమాగా చెప్పారు.
 
తాజాగా జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. గత 30-35 ఏళ్ల కాలంలో బెంగాల్‌లో అధికార పార్టీని.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీ ఢీకొన్న సందర్భాలు లేవని తెలిపారు. బీజేపీ ఈ ఎన్నికల్లో కులం ఆధారంగా ఓట్లు సంపాదించేందుకు యత్నిస్తోందని తెలిపారు. అయితే, బెంగాల్‌లో కూడా కులం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అక్కడి ప్రజలు కాస్త భిన్నంగా వ్యవహరిస్తారని తెలిపారు.
 
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని దృష్టిలో ఉంచుకొని గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎస్సీలు, నమశూద్రులు, మాతువా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మూకుమ్మడిగా బీజేపీకి ఓటేశారని ప్రశాంత్‌ కిశోర్‌ తెలిపారు. అయితే, ఆ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో బీజేపీపై ఈ వర్గాలకు నమ్మకం పోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని.. అదే వారిపై నమ్మకం పోయిందనడానికి నిదర్శనమన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు