రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్లో కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ ధృవీకరణ ఉన్న వ్యక్తులే జూలై ఒకటో తేదీ నుంచి తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే రైల్వే టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని రైల్వే శాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. అలాగే, జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీని తప్పనిసరి చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాత్కాలిక తాజాగా సర్క్యులర్ జారీచేసింది.
రైల్వే శాఖకు చెందిన బుకింగ్ కౌంటర్లు, ఆధీకృత ఏజెంట్లు కూడా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సివుంటుంది. ఆధీకృత ఏజెంట్లకు తత్కాల్ టిక్కెట్లు బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే ఏసీ తరగతులకు ఉదయం 10.30 గంటల తర్వాత నాన్ ఏసీ తరగతులకు ఉదయం 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్ వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీలో తమ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
అనధికారిక బుకింగ్లను నిలిపివేయడానికిగాను రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, ట్రైల్ బయలుదేరే సమయం కంటే 4 గంటల ముందు మాత్రమే ప్రస్తుతం వెయింటింగ్ లిస్టులో ఉన్న టిక్కెట్ల స్టేటస్ తెలుస్తోంది. ఇకపై 24 గంటల ముందే ఆ వివరాలను వెల్లడించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులోభాగంగా, బికనేర్ డివిజన్లో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టినట్టు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.