ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత సైన్యం ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడిందని, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్థాన్ పాలకులకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్థాన్ భూభాగంలో వందల మైళ్లు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయని ఆయన చెప్పారు. అలాగే, భారత్ క్షిపణులు తమ లక్ష్యాలను పక్కాగా ఛేదించాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారని చెప్పారు.
యూపీలోని కాన్పూర్లో ఆయన వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మనం పాకిస్థాన్లోని వందల మైళ్లు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం అని ప్రకటించారు. మన సాయుధ బలగాలు విరోచిత చర్యలతో పాకిస్థాన్ సైన్యం యుద్ధాన్ని ఆపమని శరణు వేడుకోవాల్సి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్తో భారత సైనిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందన్నారు. ముఖ్యంగా, బ్రహ్మోస్ క్షిపణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉందన్నారు. బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్థాన్ సైన్యానికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు.
కాగా, భారత్ మే 9, 10వ తేదీ రాత్రుల్లో బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి, తమ దేశంలోని లక్ష్యాలను ఛేదించాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, మే 10వ తేదీన పాకిస్థాన్లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరం, ఇతర లక్ష్యాలను బ్రహ్మోస్ క్షిపణులు తాకాయని ఆయన వెల్లడించారు.