కృష్ణ భగవాన్ సేవ కోసం ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా!

శుక్రవారం, 30 జులై 2021 (14:27 IST)
మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే అదో ప్రత్యేమైన గౌరవం. ఇవి సాధించాలంటే ఆషామాషీ కాదు. దేశాన్ని నడిపించే ఐఏఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాలను కొందరు తృణప్రాయంగా వదిలేస్తున్నారు. తాజాగా హర్యానా రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా ఇదే పని చేసి అందరికీ తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఇంతకాలం ప్రజా సేవ చేసిన తాను... ఇకపై దైవ సేవ చేసుకుంటానని చెపుతూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తన వీఆర్ఎస్‌కు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇకపై తాను అసలైన జీవిత లక్ష్యం దిశగా అడుగులు వేస్తానని చెప్పారు. 
 
గురునానక్, తులసీదాస్, కబీర్ దాస్, చైతన్య మహాప్రభు తదితరులు చూపించిన మార్గంలో పయనిస్తానని తెలిపారు. తన శేష జీవితాన్ని కృష్ణ పరమాత్ముడి సేవకు అంకితం చేస్తానని చెప్పారు. భారతీ అరోరా 23 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె ఐజీ స్థాయిలో ఉన్నారు. 
 
తన కెరీర్‌లో ఆమె ఎన్నో బాధ్యతలను నిర్వహించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసు దర్యాప్తులో కూడా ఆమె పాలుపంచుకున్నారు. ఇన్నేళ్ల పాటు ఐసీఎస్ అధికారిగా సేవలందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛంద విరమణకు గల కారణాలను తన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నానని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు