దేశంలోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రికి అనూహ్య ఓటమి!

ఠాగూర్

ఆదివారం, 2 జూన్ 2024 (17:45 IST)
దేశంలోనే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్‌ ఓటమిపాలయ్యారు. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు అనూహ్యంగా ఓటమిని చవిచూశారు. ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును ఆదివారం చేపట్టారు. ఇందులో ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌‌కు ఘోర పరాభవం ఎదురైంది. 
 
2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఈ పార్టీ.. ప్రస్తుతం 32 స్థానాల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది. 2019తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోవడం గమనార్హం. పార్టీ అధినేత, దేశంలోనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిని మూటగట్టుకున్నారు. 1985 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన ఆయన తొలిసారి పరాజయం పాలయ్యారు.
 
ఆయన 1994- 2019 వరకు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. అయితే, ఈ ఎన్నికల్లో పాక్లోక్‌ కామ్రాంగ్‌, నామ్చేబంగ్‌ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి దిగారు. పాక్లోక్‌ కామ్రాంగ్‌లో ఎస్‌కేఎం అభ్యర్థి భోజ్‌రాజ్‌ రాయ్‌ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో, నామ్చేబంగ్‌లోనూ అదే పార్టీకి చెందిన రాజుబసంత్‌ చేతిలో 2256 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 
 
అలాగే, సిక్కిం శాసనసభలో చామ్లింగ్ అడుగు పెట్టకపోవడం 39 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అధికార ‘సిక్కిం క్రాంతికారీ మోర్చా ప్రభంజనం సృష్టించి ఏకంగా 31 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019లో ఎస్‌కేఎంకు 17 సీట్లు రాగా.. ఈసారి మరో 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు