భారత సైన్యంతో పెట్టుకుంటే అంతే సంగతులు : సుశీల్ కుమార్ షిండే.. ట్విట్టర్లో ప్రశంసలు..

శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (12:43 IST)
భారతదేశం సత్తా, ఇండియన్ ఆర్మీ పవరేంటో పాకిస్థాన్‌కి మరోసారి తెలిసొచ్చింది. ఉగ్రవాదులతో దాడులు చేయిస్తూ పైశాచిక పరాచకమాడిన పాకిస్థాన్‌కు దవడ పగిలేలా భారత్ సైన్యం సమాధానమిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) లోకి దూసుకెళ్లి ఉగ్రవాదం పీచమణిచింది. 38 మంది ఉగ్రవాదులను ఖతం చేసి.. టెర్రర్ క్యాంప్‌లను నేలమట్టం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రస్థావరాలున్నట్లు కచ్చితమైన సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఉగ్రమూకల్ని ఏరివేయడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు కదిలింది. 
 
టెర్రరిస్టులకు తప్ప సాధారణ పౌరులకు ప్రాణ, ఆస్తి నష్టం జరగని రీతిలో సర్జికల్ ఆపరేషన్స్ నిర్వహించింది. పాకిస్థాన్ ఆర్మీకి ముందుగానే సమాచారం ఇచ్చి ఉగ్రమూకలపై విరుచుకుపడింది. సైన్యం తీసుకున్న చ‌ర్య‌ల‌పై దేశంలోని అన్ని వ‌ర్గాల నుంచి పొగడ్తల వర్షం కురుస్తోంది. చిన్నారుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ భార‌త జ‌వాన్ల‌కు జై కొడుతున్నారు. 
 
తాజాగా ఇండియ‌న్‌ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఈ అంశంపై ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ భారత సైన్యంతో పెట్టుకుంటే అంతే సంగతులు అని పేర్కొన్నాడు. ''భారతీయ్ సేనా సే పంగా మత్ లేనా.. జైహింద్'' అని హిందీలో ఆయ‌న ట్వీట్ చేశాడు. మ‌రోవైపు వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ దత్, విజేందర్ సింగ్‌లు కూడా భార‌త సైన్యం తీసుకున్న చ‌ర్య‌పై ఆనందం హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇదే కోవలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా భార‌త సైన్యం చేసిన సాహ‌సంపై ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. ప్రతి ఒక్క ఇండియ‌న్‌ ప్రాణం ఎంతో విలువైందని నిరూపించిన జ‌వాన్ల‌కు హ్యాట్సాఫ్ అని అన్నాడు. 

వెబ్దునియా పై చదవండి