తల్లి బంగారు నగల్లో తనకు వాటా ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో చితిపై తన తల్లి మృతదేహంతో పాటు తనను కూడా కాల్చివేయాలంటూ ఓ కుమారుడు పట్టుబట్టాడు. అంతేకాదండోయ్.. బంగారు నగల్లో వాటా ఇచ్చేందుకు తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించబోనని ప్రకటిస్తూ చితిపై పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్ విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ (80) అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు ఆమె బాధ్యతలను పెద్ద కుమారుడు చూసుకుంటూ వచ్చాడు. అయితే, తల్లి చనిపోయిన తర్వాత ఆమెకున్న బంగారు నగలు, వెండి గాజులను తల్లిని చూసుకున్న పెద్ద కుమారుడుకు కుటుంబ సభ్యులు అప్పగించారు.
ఈ విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు అడ్డం తిరగబడ్డాడు. తల్లి ఆభరణాలలో తనకు కూడా వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చివేయండి అంటూ చితిపై పడుకొని చిన్న కుమారుడు బీభత్సం సృష్టించాడు. చివరకు ఆభరణాల్లో అతడికి ఇవ్వడంతో తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.