కరోనాపై పోరాటం.. రూ.1500 కోట్ల విరాళం : టాటా గ్రూప్

శనివారం, 28 మార్చి 2020 (21:15 IST)
కరోనా వైరస్ మహమ్మారిని దేశం నుంచి పారదోలేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యల కోసం కేంద్రానికి టాటా గ్రూపు మద్దతు ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.వెయ్యి కోట్లు టాటా సన్స్, మరో రూ.500 కోట్లను టాటా ట్రస్ట్ నుంచి అందించాలని నిర్ణయించింది. 
 
ఇదే అంశంపై రతన్ టాటా స్పందిస్తూ, కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అత్యవసర చర్యలు అవసరమని అన్నారు. కరోనా వైరస్ మానవాళికి ఎదురైన అత్యంత క్లిష్టమైన సవాల్ అని అభివర్ణించారు. కాగా, ఈ టాటా గ్రూప్ విరాళాన్ని వైద్యసిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు, వెంటిలేటర్ల కొనుగోలుకు, టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు, వైద్యసదుపాయాల విస్తరణకు ఉపయోగించనున్నారు.
 
మరోవైపు, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించారు. దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తికి ఈయన స్పందించారు. 
 
ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదేనని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
 
మనవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, తాను పొదుపు చేసిన డబ్బు నుంచి పాతిక కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. "మనం ప్రాణాలను కాపాడుదాం. ప్రాణాలుంటేనే జీవించగలం" అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు