సివిల్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంటే... మరోగదిలో బాలికపై లైంగిక దాడి.. ఎక్కడ?

సోమవారం, 12 అక్టోబరు 2020 (17:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందనే విషయం తేటతెల్లమవుతోంది. ఇటీవల వెలుగు చూసిన హత్రాస్ హత్యాచార ఘటనపై దేశ యావత్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు మంటలు ఇంకా చల్లారనేలేదు. ఈ క్రమంలో తాజాగా మరో అత్యాచార ఘటన తాజా వెలుగు చూసింది. ఓ కాలేజీ భవనంలోని గదిలో సివిల్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంటే.. మరో గదిలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఝాన్సీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఝాన్సీకి చెందిన ఓ మైనర్ బాలికను 12 మంది కాలేజీ విద్యార్థులు బలవంతంగా కాలేజీ క్యాంపస్‌లోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆ బాలికపై ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి తెగబడ్డారు. ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుంటే మిగతా వారు మొబైల్‌లో వీడియో చిత్రీకరించారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక వద్ద ఉన్న రెండు వేల రూపాయల నగదును కూడా దోచుకున్నారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోను సామాజిక మాద్యమాల్లో వైరల్‌ చేస్తామని వారు హెచ్చరించారు.
 
అయితే, ఆ కాలేజీ క్యాంపస్‌లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు బాలిక కేకలు వినిపించాయి. దీంతో వారు ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా తనపై జరిగిన లైంగిక దాడి గురించి పోలీసులకు తెలిపింది.
 
దీనిపై స్పందించిన పోలీసులు... క్యాంపస్‌లోని 8 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులైన రోహిత్‌ సైని, భారత్ కుష్వాహా కూడా వీరిలో ఉన్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి దినేశ్‌ కుమార్‌ తెలిపారు. 
 
వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై త్వరగా దర్యాప్తు జరిపి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ వంశీ ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు