కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే దేశంలో ఆ కొరత: ప్రియాంక గాంధీ

గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:46 IST)
ఒక పక్క దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలు చేపడుతున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా కేంద్ర నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగితేలుతున్నారంటూ మండిపడ్డారు.

ప్రజలు ఆక్సిజన్  కొరతతో బాధపడుతుంటే..  బిజెపి నేతలు  ప్రతి ర్యాలీలోనూ నవ్వుతూ ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ప్రణాళిక లోపం వల్లే దేశంలో ఆక్సిజన్‌, కొవిడ్‌ టీకాలు, రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడిందని అన్నారు. ప్రజల ఆరోగ్యం కంటే ఎక్కువగా అధికారంపైనే కేంద్రం దృష్టిపెట్టిందని, అందుకే దేశంలో కరోనా విజఅంభణ తారాస్థాయికి చేరుతోందని అన్నారు.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఆదివారం ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌ ఎందరికి జరిగిందనేదానిపై దృష్టి పెట్టకుండా, జనాభాలో ఎంత శాతం మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందనే దానిపై దృష్టి  పెట్టాలని ఈ లేఖలో మన్మోహన్‌ సింగ్‌ కోరారు.

ఈలేఖపై ఆమె స్పందిస్తూ.. మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా పదేళ్ళు పని చేశారని, ఆయన ఎంత హుందాగా వ్యవహరించారో అందరికీ తెలుసునని, ఆయన ఇచ్చిన సలహాను మోడీ ప్రభుత్వం స్వీకరించాలని కోరారు.
 
గత మూడు నెలల్లో భారత్‌ నుండి 6 కోట్ల కరోనా వ్యాక్సిన్‌లు విదేశాలకు ఎగుమతి అయ్యాయని, అయితే అదే సమయంలో దేశంలో కేవలం 3-4కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్‌లు ఇచ్చారని అన్నారు. గత 6 నెలల్లో 1.1 మిలియన్ల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను ఎగుమతి చేశారని చెప్పారు.

ప్రపంచంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహం లేకపోవడం వల్లే పలు రాష్ట్రాలు ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయని అన్నారు. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమవుతుందని నిపుణులు హెచ్చరించిన వెంటనే ఆ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో కేంద్రం విఫలమైందని ఆమె ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు