ప్రధాని రుణ పథకం పేరుతో ఘరానా మోసం : రూ.4 కోట్లను స్వాహా చేసిన గ్యాంగ్

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (15:34 IST)
ప్రధానమంత్రి యోజనా పథకం రుణం మంజూరు చేస్తామంటూ బురుడీ కొట్టించిన ఓ గ్యాంగ్ ఏకంగా 4 వేల మంది నుంచి నాలుగు కోట్ల రూపాయల మేరకు స్వాహా చేసింది. ఈ ఘరానా మోసం మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ ఘరానా మోసం కేసులో ఓ రాజకీయ నేతతో సహా పలువురుని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత యేడాది మార్చి నెలలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఆకస్మికంగా లాక్డౌన్ ప్రకటించింది. దీంతో లక్షలాది మంది అనేక ఇబ్బందులు పడ్డారు. చాలా మందికి పనుల్లేక, జీతాలు రాక పస్తులుండాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. కొందరు వలస కూలీలు సొంతూర్లకు నడిచే వెళ్లిపోయారు. 
 
ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేటుగాళ్లు.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి రుణ పథకం, ముద్ర రుణ పథకాల పేరిట ఫేక్ లోన్ల తంతును నడిపించారు. దానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడూ సహకరించారు. ప్రధానమంత్రి లోన్ యోజన, ప్రధానమంత్రి యోజన లోన్, సర్వోత్తమ్ ఫైనాన్స్ వంటి ఫేక్‌వెబ్ సైట్లనూ ప్రారంభించి జనాలను నమ్మించారు.
 
ఆ తర్వాత కేటుగాళ్లు తమ పనిని చక్కబెట్టారు. ఫోన్లు చేసి ఏకంగా 2.8 లక్షల మంది వద్ద వ్యక్తిగత సమాచారం సేకరించారు. అందులో బ్యాంకు వివరాలు కూడా ఉన్నాయి. ప్యాన్, ఆధార్, ఓటర్ ఐడీ వంటి వివరాలను కూడా సేకరించారు. ఇలా దాదాపు 4 వేల మంది నుంచి సైబర్ మోసగాళ్లు రూ.4 కోట్ల దాకా వసూలు చేశారు. 
 
ఓ బాధితుడు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. పీఎంవైఎల్, పీఎం భారత్ లోన్ యోజన, ప్రధాన మంత్రి యోజన లోన్, సర్వోత్తమ్ ఫైనాన్స్, ప్రధాన మంత్రి ముద్ర లోన్, భారత్ యోజన లోన్, ముద్ర లోన్, క్రిష్ణ లోన్ వంటి పేర్లతో ఫేక్ లోన్ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. 
 
కొన్ని సోషల్ మీడియా సైట్లలో నిందితులు వాటిపై ప్రకటనలు కూడా ఇచ్చినట్టు తేల్చారు. దాని మీద క్లిక్ చేసిన బాధితులకు సంబంధించి సమగ్ర వివరాలనూ తీసుకున్నారని గుర్తించారు. లోన్ అవసరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజును నిర్ధారించినట్టు గ్రహించారు.
 
రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా రుణాలిస్తామంటూ కేటుగాళ్లు హామీలిచ్చినట్టు తేల్చారు. దానికి షూరిటీ, బాండ్స్ ఏవీ అవసరం లేవనడంతో చాలా మంది రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని గుర్తించారు.
 
ఈ రుణాల మోసం కోసం యూపీలోని అలీగఢ్, రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాల్ సెంటర్లూ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. విద్యార్థులనే అందులో ఉద్యోగులుగా నియమించారు. ఆ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు.. రాజకీయ నేత సహా నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు