అలా వికాస్ దూబే కథ ముగిసిపోయింది

శుక్రవారం, 10 జులై 2020 (09:20 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరం నుంచి వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాన్పూరు టోల్ ప్లాజా వరకు తీసుకువచ్చారు.

13 కార్లలో సాయుధ పోలీసుల భద్రత మధ్య రోడ్డు మార్గంలో ఉజ్జయిని నుంచి దూబేను తీసుకొని గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం కాన్పూరుకు తీసుకువచ్చారు.

ఉదయం 10 గంటలకు కాన్పూర్ కోర్టులో హాజరు పర్చాలని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. 60 కేసుల్లో నిందితుడైన దూబేను కోర్టులో హాజరు పర్చి అతన్ని విచారించేందుకు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతలోనే ఎన్ కౌంటర్ జరగడంతో అతని కథ ముగిసిపోయింది.
 
అతను అనుకున్నదే జరిగింది
వికాస్ దూబేను ఎన్‌కౌంటర్ భయం వెంటాడింది. బిక్రూ గ్రామంలో ఈ నెల 3వతేదీన 8 మంది పోలీసులను హతమార్చి పారిపోయిన వికాస్ దూబే కోర్టులో, లేదా టీవీ స్టూడియోలో లొంగిపోయేందుకు ప్రయత్నించగా కోర్టు కాంప్లెక్సుల్లో, టీవీ స్టూడియోల వద్ద పోలీసులను మోహరించడంతో ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతో అతను వెనుకంజ వేశాడని సమాచారం.

గత వారం రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ వికాస్ దూబే గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరానికి వచ్చి అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. చివరకు అతను అనుకున్నదే జరిగింది.
 
కాన్పూరులో హైఅలర్ట్
వికాస్ దూబే అరెస్టు అనంతరం కాన్పూర్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉజ్జయిని ఎస్పీ మనోజ్ సింగ్ 150 మంది సాయుధ పోలీసులను వెంట తీసుకొని వచ్చి గార్డు నుంచి వికాస్ దూబేను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

8మంది పోలీసులను హతమార్చిన వికాస్ దూబే పరారీ అనంతరం కాన్పూర్ తోపాటు యూపీ రాష్ట్రం మొత్తం, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అతని కోసం గాలించారు. ఎట్టకేలకు ఉజ్జయినిలో వికాస్ దూబేను అరెస్టు చేయడం సంచలనం రేపింది. 
 
అంత ఆస్తి ఎలా?... నోరెళ్లబెడుతున్న ఐటీ వర్గాలు
వికాస్ దూబే ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ దృష్టి సారించింది. 8 మంది పోలీసులను అత్యంత పాశవికంగా హతమార్చి పారిపోయి పోలీసులకు చిక్కిన వికాస్ దూబే తక్కువ కాలంలో కోట్లాదిరూపాయల ఆస్తులు సంపాదించాడని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం అందింది.

తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఆదాయపుపన్నుశాఖ పరిశోధన విభాగం అధికారులు దూబే బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. వికాస్ దూబే సన్నిహిత బంధువుల పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు పలు దేశాల్లో ఆస్తులున్నాయని వెల్లడైంది. దూబే 8 నెలల క్రితం లక్నో నగరంలో రూ.5కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతోపాటు బ్యాంకాంక్ నగరంలో ఓ హోటల్ లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టాడని సమాచారం. వికాస్ దూబేకు 12 ఇళ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్ లో 28 కోట్ల ఆస్తులున్నాయని తేలింది.

ఆర్యనగర్ లో దూబే సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ 5కోట్లరూపాయలుంటుందని తేల్చారు. కాన్పూర్ నగరంలోని పంకీ ప్రాంతంలో దూబేకు డూప్లెక్స్ బంగళా ఉంది. దీనివిలువ రూ.2కోట్లు అని పోలీసులు చెప్పారు. ఐటీ అధికారులు దూబేతోపాటు అతని బంధువులు, సన్నిహిత అనుచరుల పేరిట ఉన్న ఆస్తుల గురించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు