ఏ వర్గాన్ని బుజ్జగించను... అందరికీ ప్రగతి ఫలాలు అందేలా చూస్తా : సీఎం యోగి ఆదిత్యనాథ్

ఆదివారం, 26 మార్చి 2017 (15:38 IST)
తాను ఏ వర్గాన్ని బుజ్జగించనని, అందరికీ ప్రగతి ఫలాలు అందేలా చూస్తానని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి గోరఖ్‌పూర్‌కు వచ్చారు. ఈ ప్రాంత ఎంపీగా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు అభిమానులు గోరఖ్‌పూర్‌ ఆలయానికి బారులుతీరారు. 
 
స్వస్థలంలో యోగికి ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి మహారాణా ప్రతాప్‌ ఇంటర్‌ కాలేజీ మైదానం వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏ వర్గాన్నీ బుజ్జగించే విధానం తాను పాటించనని తేల్చిచెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో కులం, మతం, లింగవివక్షకు తావుండదన్నారు. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత షా సూచించినట్లుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రగతికి తాను కట్టుబడి ఉన్నానన్నారు.
 
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లేవారికి రాష్ట్రప్రభుత్వం ఇచ్చేసాయాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గూండారాజ్‌కు, అవినీతికి తావుండదన్నారు. ‘నేను బాధ్యతలు స్వీకరించాక పలువురు బాలికల నుంచి ఫోన్లు వచ్చాయి. ఆకతాయిల వేధింపుల గురించి వారు వాపోయారు. చాలా మంది మధ్యలోనూ చదువులు ఆపేశామన్నారు. దీంతో బాలికలు, మహిళల రక్షణకు యాంటీ-రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి