ఆస్ట్రేలియాలో ఇటీవలి కాలంలో భారతీయులపై చోటుచేసుకుంటున్న దాడులతో భారతదేశంలో తమ దేశ ప్రతిష్ట మసకబారిపోతోందని.. ఆ దేశ హై కమీషనర్ పీటర్ వర్ఘీస్ వాపోయారు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయనీ ఆయన పేర్కొన్నారు.
ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొన్న వర్ఘీస్ మాట్లాడుతూ.. భారతీయులపై కొనసాగుతున్న దాడులతో భారత్లో తమ దేశ ప్రతిష్ట దిగజారిపోతోందని ఒప్పుకోక తప్పటం లేదన్నారు. అయితే భారత్లో మీడియా వ్యతిరేక ప్రచారంతో తమకొచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు. తమ దేశంలోని పట్టణ ప్రాంతాలలో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడులు జాతివివక్షతో కూడుకున్నవి కావని ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా సురక్షితమైన దేశం కాదని భారత్ భావించినప్పుడే తమకు ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుందని వర్ఘీస్ అన్నారు. అలా జరిగితే మాత్రం అది చాలా ఆందోళనకరమైన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. విద్యార్థులపై దాడులను అరికట్టేందుకు పోలీస్ పెట్రోలింగ్ పెంచటం, దోపిడీ నియంత్రణ బృందాల పెంపుదల, చట్టంలో పలు మార్పులు.. లాంటి చర్యలను ఆసీస్ చేపట్టిందని వర్ఘీస్ వివరించారు.