భార్యను వేధించిన ఎన్నారైకు జైలుశిక్ష

FILE
అదనపు కట్నం కోసం విదేశీ గడ్డపై సైతం భార్యను కొట్టి వేధించాడన్న అభియోగం రుజువు కావడంతో ఓ ప్రవాస భారతీయుడికి కోర్టు మూడేళ్ల జైలుశిక్ష, 5 వేల రూపాయల జరిమానాను విధించింది. అలాగే ఈ కేసులో ముద్దాయిలైన అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్తలకు మూడు నెలల జైలు శిక్షతో పాటు 3 వేల రూపాయల జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే... తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుర్రంకొండ వాసుదేవరావు, 2001 ఆగస్టు 3వ తేదీన నెల్లూరు శాంతి నగర్‌కు చెందిన సవరాల సాయిశ్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో సాయిశ్రీ తల్లిదండ్రులు కట్నంగా 5 లక్షల రూపాయల నగదు, 50 సవర్ల బంగారం, లక్ష విలువచేసే ఇంటిసామాన్లను ఇచ్చారు.

తరువాత తిరుపతిలో కొంతకాలం, ఆపై బెంగళూరులో కాపురం ఉన్న వాసుదేవరావు కొడుకు పుట్టిన తరువాత మరో 5 లక్షల రూపాయల కట్నం తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. అతడికి తోడుగా అతడి తల్లి, తండ్రి, చెల్లెలు, చెల్లలు భర్త కూడా సాయిశ్రీని వేధించేవారు.

ఆ తరువాత లండన్‌కు మకాం మార్చిన వాసుదేవరావు తరచుగా మద్యం సేవించి సాయిశ్రీని తీవ్రంగా హింసించేవాడు. చాలా కాలం ఓర్చుకున్న ఆమె చివరికి లండన్‌లోని చిప్పన్‌హామ్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా అతడిని వదిలిపెట్టి కుమారుడితో పాటు తల్లిదండ్రుల చెంత చేరింది.

అంతటితో ఆగని సాయిశ్రీ.. తనని వేధించిన ఐదుగురిపై ప్రైవేటు క్రిమినల్ కేసు దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నిందితుల నేరం రుజువు అయినందున న్యాయస్థానం దోషులకు శిక్ష విధించి, సాయిశ్రీకి తగిన న్యాయం చేకూర్చింది.

వెబ్దునియా పై చదవండి