శ్రావణ్‌కు పాక్షిక అంగవైకల్యం తప్పకపోవచ్చు

ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడికి గురై, కోమా నుంచి బయటపడిన ఆంధ్ర విద్యార్థి శ్రావణ్ కుమార్ కొద్దిగా కోలుకుని మెల్లిగా అడుగులు వేస్తున్నాడని మెల్‌బోర్న్‌లో ఉంటున్న అతని బాబాయి తీర్థల శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. దాడి తరువాత శ్రావణ్ బుధవారం బాత్రూం వరకు నడిచి వెళ్లగలిగాడని, తన బంధువులను గుర్తుపట్టి, వారి మాటలకు బదులిచ్చాడని ఆయన తెలిపారు.

తనతో శ్రావణ్ మాట్లాడాడనీ, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే తను పూర్తిగా కోలుకుంటాడనే ఆశ మాత్రం లేదని శ్రీనివాస్ ఆవేదనగా అన్నారు. శ్రావణ్ కొన్నిసార్లు గందరగోళానికి గురవుతున్నాడనీ, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడని ఆయన వాపోయారు.

ప్రమాదం నుంచి శ్రావణ్ పూర్తిగా బయటపడినా వినిడికి, దృష్టికి సంబంధించి కొద్దిగా అంగవైకల్యం తప్పక పోవచ్చని శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రావణ్ మరింతగా కోలుకునేందుకు అతడిని రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపాలని వైద్యులు చెబుతున్నారని, అయితే అక్కడ చికిత్సకు అయ్యే ఖర్చును భరించే స్తోమత తమకు లేదని అన్నారు.

ఆర్థిక సాయం కోసం ఆస్ట్రేలియాలోని భారతీయులను, అధికారులను సంప్రదిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. శ్రావణ్‌పై దాడి జాతి వివక్షతోనే జరిగిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు చర్య అవుతుందని, పోలీసులు ఇప్పటికైనా చురుగ్గా స్పందించి దాడుల్ని అరకట్టాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... మెల్‌బోర్న్‌లో ఇటీవల శ్రావణ్‌ను దుండగులు స్క్రూడ్రైవర్‌తో దాడి చేసిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి