అమెరికాలో సీఎం చంద్రబాబు పర్యటన... ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం

శనివారం, 22 సెప్టెంబరు 2018 (20:07 IST)
న్యూ జెర్సీ: ఈ నెల 23 నుంచి 26 వరకు అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని నాట్స్ డైరక్టర్ మన్నవ మోహన కృష్ణ, కలపాతపు బుచ్చిరామప్రసాద్ తెలిపారు. ఈ నెల 24 ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రతిష్టాత్మక సదస్సులో సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. 
 
గో ఏపీ సంస్థ ఆధ్వర్యంలో పలు కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కొలంబియా యూనివర్సిటీలో సాంకేతిక యుగంలో పరిపాలన అనే అంశంపై జరిగే సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తారు. చికాగో యూనివర్సిటీతో MOUలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. యుఎస్, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నిర్వహించే సదస్సులో కూడా చంద్రబాబు పాల్గొంటారు. దీంతో పాటు యూఎస్ ఇండియా వాణిజ్య మండలి, సీఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో ఏపీలో పెట్టుబడుల పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ప్రసంగిస్తారు.
 
న్యూజెర్సీలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 23న న్యూజెర్సీలో నిర్వహించే సభకు భారీగా ప్రవాసాంధ్రులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు మన్నవ మోహన కృష్ణ, కలపటపు బుచ్చి రామప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు