అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...

గురువారం, 31 జనవరి 2019 (16:42 IST)
అమెరికాలోని డెట్రాయిట్ లో అక్కడి అధికారులు అరెస్ట్ చేసిన తెలుగు విద్యార్ధులకు న్యాయ సాయం చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికాలో తెలుగు విద్యార్ధుల అరెస్టులు ప్రారంభం కాగానే చాలమంది తెలుగు విద్యార్ధులు సాయం కోసం నాట్స్ హెల్ఫ్ లైన్‌కు కాల్ చేశారు. 
 
తమకు సాయం చేయాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అమెరికాలో న్యాయనిపుణులతో చర్చలు ప్రారంభించారు. న్యూజెర్సీలోని న్యాయ నిపుణులు తెలుగువారైన శ్రీనివాస్ జొన్నలగడ్డతో విద్యార్ధులను ఎలా విడిపించాలనే దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
నకిలీ మాస్టర్ డిగ్రీలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు 200 మందికి పైగా తెలుగువారిని అదుపులోకి తీసుకున్నారు. 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించిన 8 మంది తెలుగువారిని అరెస్ట్ చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి నకిలీ యూనివర్సిటీ- యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ఏర్పాటు చేసిన హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఇమ్మిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
 
అయితే ఇక్కడ వందలాది మంది నకిలీ ధ్రువపత్రాలతో ఉన్నారని అమెరికా అధికారులు అంటున్నారు. వీసా కాలపరిమితి ముగిసినా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారిని అమెరికా అధికారులు పట్టుకున్నారు. ఇందులో తెలుగువారు అధికంగా ఉన్నారు. వీరికి న్యాయసాయం అందించి వీరికి భరోసా ఇచ్చేందుకు నాట్స్ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు