బిల్వపత్రాలు.. పరమశివుడు.. సంబంధం ఏమిటి?

సోమవారం, 24 మే 2021 (14:03 IST)
పరమ శివుడు అభిషేక ప్రియుడు.దోసెడు నీళ్లతో అభిషేకం చేసి .. బిల్వ పత్రాలతో పూజిస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. అలా సదాశివుడు అభిషేకానికే ఆనందించడానికీ .. బిల్వ పత్రాలతో ప్రీతి చెందడానికి కారణం లేకపోలేదు. పూర్వం సముద్ర మథనంలో హాలాహలం పుట్టినప్పుడు, సమస్త జీవులను కాపాడటం కోసం ఆయన ఆ విషాన్ని కంఠంలో బంధించాడు. ఆ కారణంగా ఆయన తల భాగమంతా వేడెక్కింది.
 
ఆయన శిరస్సు చల్లబడటం కోసం దేవతలంతా నీటితో అభిషేకం చేశారు. బిల్వ పత్రాలు చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. అందువలన దేవతలు వాటితో శివుడిని పూజించారు. అప్పుడు శివుడికి ఉపశమనం కలిగింది. అందువలన శివుడికి అభిషేకం .. బిల్వ పత్రాలతో పూజ ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇక మహాశివరాత్రి రోజున ఆ దేవదేవుడిని అభిషేకించి .. బిల్వ పత్రాలతో పూజించేవారికి, మరింత విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
 
బిల్వపత్రాల మూడు ఆకుల సముహాన్ని శివుడికి అర్పిస్తారు. అన్ని తీర్థయాత్రలు ఆ సముహంలోనే ఉన్నాయని ప్రతీతి. సోమవారం రోజున మహాదేవుడిని పూజించడం వలన సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతుంటాయి. బిల్వపత్రాలను ఎప్పుడు తరగకూడదు.

బిల్వపత్రాలను ఎల్లప్పుడు శివుడికి తలక్రిందులుగా అర్పిస్తారు. అంటే మృదువైన ఉపరితలం వైపు శివుడి విగ్రహాన్ని తాకిన తర్వాతే బిల్వపత్రాలను అర్పిస్తారు. రింగ్ ఫింగర్, బొటనవేలు మరియు మధ్యవేలు సహాయంతో బిల్వపత్రాలను అందించాలి.. వాటితో శివుడిని అభిషేకించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు