దెయ్యాలు వెంటాడుతున్న ఊరు

ఏది నిజంలో భాగంగా ఇంతవరకు మేము ఏదో ఒక దెయ్యం లేదా భూతం ఆవహించి ఉన్న వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ వచ్చాం. కానీ, గ్రామం మొత్తాన్ని క్షుద్ర శక్తులు వెంటాడుతున్న ప్రాంతానికి ఈ వారం మిమ్మల్ని తీసుకుపోతున్నాం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్కోన్ సమీపంలోని బైడా గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్తులు తెలియని వ్యాధి బారిన పడి ఉన్నట్లుండి మరణించారు. అయితే వీరి చావుకు కారణాలు తెలియని గ్రామస్తులు... స్థానిక మంత్రగాడిని సంప్రదించారు. వీరి చావుకు ఒ దెయ్యం కారణమని అతడు చెప్పాడు. పైగా, సరైన చర్య తీసుకోకపోతే ఆ దెయ్యం ఇతరులను కూడా పట్టి పీడిస్తుందని ఆ మంత్రగాడు హెచ్చరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు అతనిని దెయ్యం బెడద వదిలించమని అభ్యర్థించారు. దీంతో అతను దెయ్యాల నుంచి ఊరు బయటపడే మార్గం చెప్పాడు.

గ్రామంలో దెయ్యం వచ్చి చేరిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఆ గ్రామానికి సంబంధించని ప్రజలను వెంటనే ఊరినుంచి వెళ్లిపోవలసినదిగా ఆదేశించాడు. మిగిలిన గ్రామస్తులు తాను ఊరి గుడిలో చేపట్టే పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని హుకుం జారీ చేశాడు.


చిట్టచివరకు గ్రామం నుంచి దెయ్యాన్ని పారదోలే ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రగాడు విచిత్రమైన చేష్టలు మొదలెట్టాడు. ఇతరులు చూడగానే భయంతో కంపించిపోయే రకం బట్టలు ధరించి, ఆ ఊరు చుట్టూ పాలు పోసి గీత గీశాడు. చివరగా ఆ ఊరునుంచి దెయ్యాలను వదలగొట్టేశానని ప్రకటించేశాడు. దీంతో గ్రామస్తులు అతడిని పొగడటం మొదలెట్టారు.
WD


మానవ స్వభావమే అంత. తనకు తెలియని, తనకు అర్థంకాని విషయాల వద్దకు వచ్చేసరికి మనిషి తప్పనిసరిగా వాటికి అతీత శక్తులతో ముడిపెట్టడం మొదలెడుతాడు. అయితే దీన్ని ఒక అవకాశంగా తీసుకుని స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకునే వారు ఎక్కడైనా సరే తయారై ఉంటారు. అమాయకుల నమ్మకాలను వీరు తమకు అనువుగా మలుచుకుంటారు. ఒక్కోసారి ఇది ఇలాంటివారికి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది కూడా.

ఇంతకూ.. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు... ఇలాంటి విషయాలను మీరు నమ్ముతున్నారా... మీ అభిప్రాయం మాకు తప్పక రాయండి...