ఉజ్జయిని సమీపంలోని మహాకాల్ ఆలయం మహాశివుడికి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరు పొందింది. శివపురాణం ప్రకారం, దూషణుడు పేరు గల రాక్షసుడి విధ్వంసక చేష్టలతో విసిగి వేసారి పోయిన ఉజ్జయిని ప్రజలు అతగాడి భరతం పట్టాలని పరమశివుడిని వేడుకున్నారు. భక్తుల విన్నపానికి సంతసించిన శివుడు పవిత్ర జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. రాక్షసుడిని సంహరించిన శివుడు భక్తులు కోరిక మేరకు తన ప్రతిరూపమైన లింగాన్ని ఉజ్జయినిలో నెలకొల్పాడు.
ఇది దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక శివలింగం. తాంత్రిక శాస్త్రానికి సంబంధించినంతవరకు ఈ ఆలయానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. కొన్ని చారిత్రక వాస్తవాలను బట్టి, వేదవ్యాసుడు, కాళిదాసు, బాణభట్ట, భోజరాజు వంటి వారు సైతం ఉజ్జయిని మహాకాలుడిని దర్శించి, పూజలర్పించారని తెలుస్తోంది.
పురాతనమైన ఈ మహాకాల్ ఆలయాన్ని 11వ శతాబ్దంలో పునర్నిర్మించారు. నిర్మించిన 140 ఏళ్ల తర్వాత సుల్తాన్ ఇల్టుట్మిష్ ఉజ్జయినిపై దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వసం చేశాడు. ప్రస్తుతం ఉన్న ఆలయం మరాటా పాలకుల కాలంలోనిది. బాబా రామచంద్ర షానవి పేరుగల మరాఠా రాజవంశానికి చెందిన దివాన్ ఈ ఆలయాన్ని 250 ఏళ్ల క్రితం పునర్నిర్మించారు.
భస్మ హారతి నిత్యం జరుగుతున్న ఏకైక శివలంగం కావడం ఈ ఆలయం మరొక విశేషం. వేద మంత్రాల ఉచ్చారణతో, స్తోత్రాల ఆలాపనలతో, సంగీత వాయిద్యాల నడుమ ప్రతిరోజూ సాయంత్రం 4 - 6 గంటల మధ్య ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. భక్తుల భం భం బోలే నినాదాల మధ్య కొనసాగే ఈ హారతి కార్యక్రమం చూడవచ్చిన వారిని తన్మయులను గావిస్తుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా ప్రతి ఒక్కరూ ఈ హారతి కార్యక్రమంలో పాల్గొనాలని ఉవ్విళ్లూరతారు మరి.
పురాణాల ప్రకారం- గతంలో భక్తులు మృతదేహాలను కాల్చగా వచ్చే బూడిదకు ప్రార్ధనలు చేసేవారని తెలుస్తోంది. ఒకసారి, ఓ పూజారి బూడిద కోసం ఏ మృతదేహం దొరక్కపోవడంతో తన పుత్రుడినే కాల్చి పూజలు సమర్పించాడట. ఈ ఉదంతం తర్వాత, ఆవు పేడ కాల్చగా వచ్చిన భస్మంతో హారతి పూజలు చేసే కొత్త పద్ధతి మొదలైంది.
WD Photo
WD
ఈ భస్మ హారతి సమయంలో భక్తులు గర్భ గుడిలోకి సాధారణ దుస్తులతో పోకూడదు. ఈ పూజా సమయంలో పురుషులు పట్టు ధోవతీలు, మహిళలు చీరలతో మాత్రమే అనుమతించబడతారు. ప్రధాన హారతి కార్యక్రమంలో పురుషులకు మాత్రమే ప్రవేశముంది. ఈ సమయంలో మహిళలు గర్భగుడిలోకి అనుమతించబడరు. భక్తులు ఈ భస్మ హారతి కార్యక్రమాన్ని గర్భగుడి వెలుపల ఉన్న నంది మందిరంలోంచి చూసి తరిస్తారు.
శివరాత్రి, శ్రావణ సోమవారం పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు భక్తి ప్రపత్తులతో, కోరికలతో మహాకాల్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. హిందూ సంవత్సరంలో అయిదవ నెల అయిన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం మహాకాలుడు తన ప్రజల స్థితిగతులను చూసేందుకు ఉజ్జయినిని సందర్శిస్తాడు. ఆ రోజున, మహాకాలుడి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి పురవీధుల్లో ఊరేగిస్తారు. మహాకాలుడి రధాన్ని శ్రావణ మాసం చివరి సోమవారం పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవానికి అశేష ప్రజానీకం తరలి వస్తారు. భక్తుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగుతుంది.
ఉజ్జయినికి ఒకే ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరే మహాకాల్. ఉజ్జయిని శివారు ప్రాంతాల్లో రాజు, చక్రవర్తులు నివశించే వారు కాదు. ఎప్పుడైతే ఉజ్జయిని సింధియాల పాలనలోకి వచ్చిందో.. వారు పట్టణ శివారు ప్రాంతాల్లో కలియాద ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు.
హారతి సమయాలు ఈ మహాకాల్ ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు హారతి ఇస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసి వేస్తారు. దీన్నే 'భస్మ హారతి' అని అంటారు. ఇది ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఉదయం 7.30 గంటల నుంచి 8.15 గం వరకు 'నైవేద్య హారతి' అంటారు. సాయంత్రం ఐదు గంటలకు 'జలాభిషేకం' పూర్తవుతుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల సమయాన్ని 'సంధ్యా హారతి' కాలంగా పేర్కొంటారు. రాత్రి 10.30 గంటల ప్రాంతాన్ని 'షయాన్ హారతి'గా పిలుస్తారు. ఆలయ ద్వారాలను రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. అయితే.. వేసవి కాలంలో ఉదయం 7 గం నుంచి 7.45 గంటల ప్రాంతాన్ని 'నైవేద్య హారతి' కాలంగాను, సాయంత్రం 7 గం నుంచి 7.30 గంటల వరకు 'సంధ్యా హారతి' కాలంగాను పేర్కొంటారు.
WD Photo
WD
మీరు అక్కడకు ఎపుడు వెళ్లాలి? ఈ ఆలయం సంవత్సరం పొడవునా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే.. ప్రతి శివరాత్రి పర్వదినంతో పాటు.. శ్రావణ మాసంలో ఈ ఆలయం అశేష భక్తజనంతో కళకళలాడుతుంది. ఇక్కడకు వచ్చే భక్తులు కాళ్ళకు పాదరక్షలను ధరించకుండా.. కావారియాను ధరించి భక్తి ప్రవత్తులతో కనిపిస్తారు. శ్రావణ మాసంలో 'శ్రావణ్ మహోత్స'వాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?
రోడ్డు మార్గం ద్వారా... ఉజ్జయిని-అగ్రా-కోట్-జైపూర్ మీదుగా. ఉజ్జయిని-భాద్వానగర్-రాట్లం-చిత్తూర్ మార్గం. ఉజ్జయిని-మాక్సి-షాహజ్నాపూర్-గ్వాలియర్-ఢిల్లీ మార్గం. ఉజ్జయిని-దేవాస్-భోపాల్ మార్గం. ఉజ్జయిని-ధులియా-నాసిక్-ముంబై మార్గం
రైలు మార్గం ద్వారా... ఉజ్జయిని నుంచి మాక్షి- భోపాల్ మార్గం (ఢిల్లీ-నాగ్పూర్ రైలు మార్గం) ఉజ్జయిని-నగ్డా-రాట్లం మార్గం (ముంబై-ఢిల్లీ మార్గం) ఉజ్జయిని-ఇండోర్ మార్గం (ఖన్బావ లైన్-మీటర్ గేజ్ లైన్)
విమానం మార్గం ద్వారా.. ఇండోర్ విమానశ్రయం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉజ్జయిని ఉంది.
ఎక్కడ బస చేయాలి? ఉజ్జయినిలో పలు హోటళ్లు, ధర్మశాలలు ఉన్నాయి. హర్షిద్దా కమిటీ, మహాకాల్ కమిటీలకు చెందిన ధర్మశాలలు సరసరమైన, ప్రియమైన (లక్సరీ) ధరల్లో అన్ని వర్గాల భక్తులకు అందుబాటులో లభ్యమవుతాయి.