శ్రీవారి కాలినడక భక్తుల దర్శనంలో రేషన్... 20 వేల టిక్కెట్లు మాత్రమే(వీడియో)

సోమవారం, 10 జులై 2017 (17:21 IST)
తిరుమల అంటేనే జనసంద్రం. ఎప్పుడూ జనంతో నిండిపోతుంటుంది. అలాంటి తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులకు పరిమితిలోనే దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా టిటిడి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని ఆ తరువాత వెనక్కి తగ్గింది. 
 
కాలి నడక భక్తులకు వచ్చే సోమవారం నుంచి 20 వేల దివ్యదర్శనం టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారాంతంలో దివ్యదర్శనం టోకెన్ల రద్దును కొనసాగించాలా వద్దా అన్న విషయంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. రేపటి నుంచి భక్తులకు త్వరితగతిన కాటేజీలు దొరకనున్నాయని, ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికే 10 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 
 
వైకుంఠం క్యూకాంప్లెక్స్ -2లోని నాలుగు కంపార్టుమెంట్లలో ఒకేచోటా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, దర్శనానికి వెళ్ళే భక్తులందరూ ఇక్కడి నుంచే తనిఖీ చేసుకుని వెళ్ళేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరు నెలల్లో అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రత విషయంలో రూపురేఖలు మార్చేస్తామన్నారు. 
 
రిజర్వ్ బ్యాంకు తాజా నిర్ణయంతో టిటిడి డిపాజిట్లపై వడ్డీ రేటు సగానికి తగ్గే అవకాశం ఉందన్నారు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. తిరుపతిలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈఓ పాల్గొన్నారు. ఈఓ తీసుకున్న నిర్ణయంపై కాలినడక భక్తుల మండిపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి