భద్రాద్రిలో అపచారం జరిగింది.. గర్భగుడిలోకి ప్రవేశించారట.. కొబ్బరికాయ కూడా కొట్టారట..

మంగళవారం, 7 మార్చి 2017 (12:58 IST)
పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారాముల వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఓ జంట నిబంధనలకు విరుద్ధంగా గర్భగుడిలోకి ప్రవేశించింది. కానీ ఈ విషయాన్ని అధికారులు, పూజారులు దాచేశారు. కానీ మీడియా కనిపెట్టేసింది.

సోమవారం సాయంత్రం ఓ జంట పూజల నిమిత్తం టిక్కెట్టు కొనుక్కుని ఆలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడ అర్చకులెవరూ లేకపోవడంతో బంగారు వాకిలి దాటి గర్భగుడిలోకి ప్రవేశించారు. అయినా ఎవరూ గమనించలేదు. సుమారు 5 నిమిషాలపాటు అక్కడే ఉన్న ఆ జంట.. కొబ్బరికాయ కూడా కొట్టినట్లు తెలిసింది.
 
ఆలస్యంగా మేలుకొన్న ఆలయ సిబ్బంది.. గర్భగుడిలోకి వెళ్లిన ఆ జంటను ప్రధాన ఆలయం నుంచి బయటకు పంపారు. వెంటనే ఆలయంలో సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. కానీ మూల విరాట్ తాకారా? లేదా అనేది తెలియనప్పటికీ సంప్రదాయాలను పాటించే ఈ ఆలయంలో పెద్ద అపచారంగా భావిస్తున్నారు.

కాగా, మరికొందరు భక్తులు కూడా ఆలయంలోకి ప్రవేశించి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దర్శనాలు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి