తిరుమలలో టైమ్‌స్లాట్ విధానం.. 2 గంటల్లో దర్శనం.. ఆధార్ తప్పనిసరి

సోమవారం, 18 డిశెంబరు 2017 (11:08 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి గంటలకొద్దీ నిరీక్షించాల్సిన అవసరం ఇక భక్తులకు ఉండబోదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఇక రెండు గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి ఈ టైమ్ స్లాట్ విధానం అమల్లోకి రానుంది. 
 
ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం, కాలినడక దివ్య దర్శనం భక్తులకు 20 వేల టోకన్లు జారీ చేయడం ద్వారా నిర్ధిష్ట సమయంలో దర్శనం కల్పిస్తున్న టీటీడీ ఈ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. తిరుమలకు పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  సర్వదర్శనం భక్తులకు 30వేల వరకు టైమ్‌స్లాట్ టోకన్లు జారీ చేయాలని నిర్ణయించింది. తద్వారా నిర్ణీత సమయంలో భక్తులు స్వామిని దర్శించకునే వీలుంటుంది.
 
ఇందుకోసం తిరుమల కొండపై 14 కేంద్రాల్లో 117 కౌంటర్లను ఏర్పాటు చేసింది. వీటిలో భక్తులకు బార్ కోడింగ్ విధానంలో టోకన్లు జారీ చేస్తారు. వాటిలో నిర్దేశించిన సమయంలో భక్తులు క్యూలోకి వస్తే సరిపోతుంది. క్యూలైన్లోకి వచ్చిన క్షణం నుంచి రెండుగంటల్లోపు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్నదే ఈ విధాన లక్ష్యమని.. టీటీడీ అధికారులు వెల్లడించారు. 
 
ఈ నెల 23 వరకు ఈ విధానం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. అప్పటి వరకు రోజుకు 30 వేల టోకన్లు జారీ చేయనుంది. ఈ ప్రయోగం ఫలిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. టైమ్‌స్లాట్ సర్వదర్శనానికి వెళ్లాలంటే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డును తిరుమలకు తెచ్చుకోవాల్సిందేనని టీటీడీ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు