ముక్కోటి ఏకాదశి : స్థానికులకు పెద్దపీట... 10 రోజుల వరకు వైకుంఠ దర్శనం!

బుధవారం, 23 డిశెంబరు 2020 (09:09 IST)
ఈ నెల 25వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినంరానుంది. దీన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది. అలాగే, వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచివుంచనుంది. అంటే డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఈ వైకుంఠ ద్వారం తెరిచివుంటుంది. నూతన సంవత్సర వేడులు కూడా కలిసివచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. 
 
సంప్రదాయానికి భిన్నంగా ఈ దఫా పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. అలాగే, ఆ 10 రోజులు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్న తితిదే... 25న ముక్కోటి ఏకాదశి నుంచి వచ్చే నెల 3న పంచమి వరకు వైకుంఠ ప్రదక్షిణలో భక్తులను అనుమతించనుంది. ఇందుకోసం టీటీడీ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. 
 
ఇకపోతే, ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 2 లక్షల టికెట్లను ఈ నెల మొదటి వారంలో ఆన్‌లైన్‌లో ఉంచింది. అలాగే, శ్రీవాణి ట్రస్టు (రూ.10 వేలు) కింద మరో 18 వేల టికెట్లను జారీ చేయగా, గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
 
అలాగే, సామాన్య భక్తుల కోసం రోజుకు 8 వేల టికెట్లను ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. దర్శనానికి ఒక రోజు ముందు నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వీటిని జారీ చేస్తారు. అయితే, ఇవి తిరుమల తిరుపతిలోని స్థానికులకే పరిమితం కానున్నాయి. ఇందుకోసం ఆధార్‌లోని చిరునామాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. కాబట్టి ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇబ్బంది పడొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు