Euro 2020 Football: వామ్మో 2వేల మందికి కరోనా పాజిటివ్!

గురువారం, 1 జులై 2021 (22:40 IST)
Euro 2020
యూరో కప్ కొంపముంచింది. క్రీడల్లో అభిమానులు వద్దురా నాయనా అంటూ వైద్యులు మొత్తుకుంటున్నా.. ఆట మీద అభిమానం ఫ్యాన్స్ కొంపముంచిందనే చెప్పాలి. యూరో కప్‌లో పాల్గొన్న రెండు వేల మంది అభిమానులు కరోనా బారిన పడ్డారు. యూరోకప్‌లో భాగంగా ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ కోసం వెంబ్లేకి వెళ్లిన ఫుట్ బాల్ అభిమానులకు కరోనా వైరస్ మహమ్మారి షాక్ ఇచ్చింది. 
 
ఈ మ్యాచ్‌కు వచ్చిన 2వేల మందికి కోవిడ్ సోకినట్లు స్కాట్లాండ్ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది. మ్యాచ్ కోసం భారీగా స్టేడియం దగ్గర జనం గుమిగూడటంతో పాటు బార్లు, పబ్‌ల దగ్గర జనం గుంపులుగా తిరిగారు. కాగా ఈ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించొద్దని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.
 
జూన్ 18న ఇంగ్లండ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ చూసేందుకు వేలాది మంది అభిమానులు స్కాట్లాండ్ నుంచి లండన్ కు వెళ్లారు. ఆ తర్వాత వారిలో 2వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ ఆంక్షల కారణంగా వెంబ్లేకి కేవలం 2వేల 600 టికెట్లు మాత్రమే స్కాట్లాండ్ కేటాయించింది. అయితే వేలాది మంది లండన్‌కు ప్రయాణం చేశారు. సురక్షితమైన ప్రదేశం ఉంటే తప్ప మ్యాచ్ చూసేందుకు రావొద్దని స్కాట్లాండ్ ప్రభుత్వం, లండన్ మేయర్ సాదిక్ ఖాన్ చేసిన హెచ్చరికలను అభిమానులు బేఖాతరు చేస్తూ వేలాది మంది వెళ్లారు. 
 
వెంబ్లే మ్యాచ్ కి ఎంట్రీకి కఠినమైన ఆంక్షలు పెట్టారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూయించాలి లేదా వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ చూపించాలి. అయినప్పట్టికి అభిమానులు తండోపతండాలు వచ్చేశారు. కరోనా బారిన పడ్డవారిలో ఎక్కువ మంది 20 నుంచి 39ఏళ్ల వయసు వారే ఉన్నారు. ఇక ప్రతి 10 కేసుల్లో 9మంది పురుషులే ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు