టోక్యో ఒలింపిక్స్ భారత పతక విజేతలకు ఉచిత విమాన ప్రయాణ ఆఫర్

సోమవారం, 9 ఆగస్టు 2021 (12:28 IST)
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తరపున పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను చూపించారు. ఫలితంగా ఇప్పటి వరకు ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 7 పతకాలతో స్వదేశానికి తిరిగివచ్చారు. 
 
అయితే, ఈ ఒలింపిక్ క్రీడల్లో పతకాలు నెగ్గిన భారత అథ్లెట్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని గో ఫస్ట్ (గతంలో గో ఎయిర్), స్టార్ ఎయిర్ విమానయాన సంస్థలు ఆఫర్ ప్రకటించాయి. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) స్వర్ణం సాధించగా, మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), రవి దహియా (రెజ్లింగ్) రజతాలు దక్కించుకున్నారు. పీవీ సింధు (బ్యాడ్మింటన్), భజరంగ్ పునియా (రెజ్లింగ్), లవ్లీనా బొర్గోహైన్ (బాక్సింగ్), పురుషుల హాకీ జట్టు కాంస్యాలు సాధించారు.
 
వీరందరికీ వచ్చే ఐదేళ్ల పాటు ఉచితంగా ప్రయాణించేందుకు టికెట్లు అందిస్తామని గో ఫస్ట్ ప్రకటించింది. భారత్‌కు 7 పతకాలు ఎప్పుడూ లభించలేదని, ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం అని తెలిపింది. అందుకే 2025 వరకు వర్తించేలా ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్నామని గో ఫస్ట్ వివరించింది.
 
ఇక దేశీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ జీవితకాల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచినవారికి ఈ ఆఫర్ అందించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని స్టార్ ఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, దేశీయంగా కూడా అనేక కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వివిధ రకాలైన అవార్డులు, రివార్డులను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు