చైన్‌స్నాచర్‌గా మారిన బాక్సర్

ఆదివారం, 16 డిశెంబరు 2018 (17:02 IST)
ఒకపుడు బాక్సర్‌గా ఉన్న వ్యక్తి నేడు చైన్ స్నాచర్‌గా మారాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన కోన నర్సింగ్‌రావు(34) అలియాస్‌ నర్సింహ గతంలో రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. 
 
ఆ తర్వాత బాక్సింగ్‌ శిక్షకుడిగా పార్ట్‌టైం చేస్తూనే, కార్లు లీజుకు తిప్పేవాడు. ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్‌గా మారాడు. తాను ఎంపిక చేసుకొన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకుండా చూసుకొని, ద్విచక్రవాహనం నెంబర్‌ ప్లేట్‌ మార్చి చోరీలకు వెళ్లేవాడు. 
 
గత ఏడు నెలల వ్యవధిలో ఆరుసార్లు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం సెంట్రల్‌జోన్‌ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నర్సింహ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద సుమారు 16 తులాల బంగారు గొలుసులు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు