30 సెకన్లలో అద్భుతం చేసిన రవికుమార్ - ఫైనల్‌కు ఎంట్రీ

బుధవారం, 4 ఆగస్టు 2021 (15:29 IST)
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా తన విజయప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ పోటీలో రవికుమార్ దహియా కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై అద్భుతం అనదగ్గ రీతిలో విజయకేతనం ఎగురవేశాడు. 
 
'దంగల్' సినిమా క్లైమాక్స్‌లో గీతా ఫోగాట్ తన ప్రత్యర్థిని చివరి నిమిషంలో ఎలా చిత్తు చేస్తుందో, ఈ పోరులో రవికుమార్ కూడా అదే చేశాడు. ఓ దశలో రవికుమార్ 2-9తో వెనుకబడి ఉండగా, అప్పటికి మ్యాచ్ ముగిసేందుకు 30 సెకన్ల సమయం మాత్రమే మిగిలుంది. 
 
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ గెలవలేని స్థితిలో రవికుమార్ తన ప్రత్యర్థి నూర్లిసామ్ సనయేవ్‌ను దొరకబచ్చుకుని ఉడుం పట్టు పట్టాడు. తద్వారా ప్రత్యర్థిని ఫాలౌట్ చేశాడు. దాంతో మ్యాచ్‌లో విజయంతో పాటు పతకం కూడా ఖాయమైంది. ఫైనల్ మ్యాచ్‌లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన ఉగుయేవ్‌తో తలపడతాడు. ఈ పోటీలో గెలిస్తే బంగారు పతకం, ఓడితే వెండి పతకంతో స్వదేశానికి రానున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు