భారత హాకీ అద్భుత విజయం : 41 యేళ్ల తర్వాత సెమీస్‌కు

ఆదివారం, 1 ఆగస్టు 2021 (19:45 IST)
టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో ఆదివారం భారత హాకీ పురుషుల జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో అచ్చెరువొందించే ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 
 
ఆదివారం సాయంత్రం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో బ్రిటన్‌పై నెగ్గింది. తద్వారా 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో సెమీస్ చేరింది. 1972 ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరోసారి సెమీస్ చేరడం ఇదే ప్రథమం.
 
మళ్లీ ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్‌లో పునర్ వైభవాన్ని గుర్తు చేస్తూ మేటి జట్లను మట్టి కరిపించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది. 1980 ఒలింపిక్స్‌‌లో భారత్ పసిడి నెగ్గినా, ఆ ఈవెంట్‌లో సెమీఫైనల్ దశ లేదు.
 
టోర్నీ మొత్తం నిల‌క‌డ‌గా రాణిస్తున్న భారత హాకీ టీమ్‌.. లీగ్ స్టేజ్‌లో 5 మ్యాచ్‌ల‌కుగాను 4 గెలిచిన విష‌యం తెలిసిందే. జట్టు త‌ర‌పున దిల్‌ప్రీత్ సింగ్‌, హార్దిక్ సింగ్‌, గుర్జిత్ సింగ్ గోల్స్ చేశారు. 
 
తొలి హాఫ్ ముగిసే స‌రికే 2-0 గోల్స్‌తో లీడ్‌లో ఉన్న భార‌త్‌.. చివ‌రి నిమిషాల్లో మ‌రో గోల్ చేసింది. అంత‌కుముందే ఓ గోల్ చేసిన బ్రిట‌న్‌.. ఇండియా ఆధిక్యాన్ని కాస్త త‌గ్గించేగానీ విజయాన్ని కైవసం చేసుకోలేకపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు