టోక్యో ఒలింపిక్స్ : ఆమె ఓడినా భారత్‌కు మరో పతకం ఖాయం

శుక్రవారం, 30 జులై 2021 (09:54 IST)
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైనట్టు కనిపిస్తుంది. 64-69 కేజీల బాక్సింగ్ విభాగంలో క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో లవ్లీనా అద్భుత‌మైన విజ‌యం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలిచింది. 
 
ఈ విజ‌యంతో ఆమె సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫ‌లితంతో సంబంధం లేకుండా ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం. సెమీస్‌లో ఒక‌వేళ ల‌వ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడ‌ల్ మాత్రం ఖాయం. ల‌వ్లీనా మూడు రౌండ్ల‌లోనూ పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. 
 
తొలి రౌండ్‌లో 3:2 తో ఆధిక్యంలో ఉండ‌గా.. రెండో రౌండ్‌లో మొత్తం ఐదుగురు జ‌డ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్‌లో న‌లుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
 
ఇదిలావుంటే, ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 8లో భాగంగా రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పెరోవాతో జరిగిన పోరులో దీపిక 6-5తో విజయం సాధించింది. 
 
మొత్తం ఐదు సెట్లలో దీపిక రెండు సెట్లను గెలుచుకోగా, పెరోవా రెండు సెట్లను దక్కించుకుంది. మరో సెట్ టై అయింది. అయితే, దీపికకు స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. అనంతరం జరిగిన షూటవుట్‌లో రష్యాకు చెందిన పెరోవా ఏడు పాయింట్లు మాత్రమే సాధించింది. 10 పాయింట్లు సాధించిన దీపిక మ్యాచ్‌ను కైవసం చేసుకుని క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు