కావలసిన పదార్థాలు : కొబ్బరి తురుము... ఒకకప్పు పంచదార... 150 గ్రాములు మైదా పిండి... పావు కేజీ ఏలకులు... 5 (పొడిచేసినవి) పచ్చ కర్పూరం... కొద్దిగా ఉప్పు... తగినంత మంచి నూనె... ఒక టీస్పూన్ పచ్చిబియ్యం... ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి... పోలీలు కాల్చేందుకు సరిపడా
తయారీ విధానం : మైదా పిండిని జల్లెడపట్టుకుని, కాస్తంత ఉప్పు వేసి, చపాతీ పిండిలా చేసుకోవాలి. ఈ పిండిలో మంచినూనె వేసి మెత్తగా ముద్ద చేసుకోవాలి. తరువాత కొబ్బరి తురుము, పచ్చిబియ్యాన్ని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఓ మందపాటి పాత్రలో రుబ్బిన మిశ్రమాన్ని, పంచదారను వేసి సన్నటి సెగపై, గట్టిపడకుండా ఉడికించాలి.
పాకం తయారైన వెంటనే కిందికి దించి అందులో పచ్చకర్పూరం, యాలక్కాయల పొడి, కాస్తంత ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత నిమ్మకాయ సైజంత ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. మైదాపిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీలాగా చేసి, అందులో కొబ్బరి మిశ్రమం ఉండలను ఒక్కోదాన్ని పెట్టి నాలుగు వైపులా మూసేయాలి. ఇప్పుడు చేతికి నూనె, లేదా నెయ్యి రాసుకుని మడిచి ఉంచుకున్న మైదా ముద్దను మెల్లగా పోలీలాగా తట్టాలి.
అలా మొత్తం పిండిని, ఉండలను కలిపి పోలీల్లాగా చేసుకున్న తరువాత... కాలుతున్న పెనంపై ఒక్కోదాన్ని వేసి, తగినంత నూనె లేదా నెయ్యిని వేస్తూ, సన్నటి మంటమీద గోల్డ్ కలర్ వచ్చేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన చక్కెర పోలీలు సిద్ధమైనట్లే...! మీరూ రుచి చూస్తారు కదూ..!