కావలసిన పదార్థాలు : పనీర్... అరకేజీ పాలు... రెండు లీటర్లు పంచదార... అరకేజీ మైదా... రెండు టీస్పూన్లు బాదం, పిస్తా ముక్కలు... కాసిన్ని
తయారీ విధానం : పనీర్ను బాగా మ్యాష్ చేసి, మెత్తగా అయిన తరువాత అందులో మైదాపిండిని వేసి బాగా కలిపి గుండ్రంగా చేయాలి. దీన్నే మందపాటి చపాతీలాగా వెడల్పుగా చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్పైన వెడల్పాటి గిన్నెపెట్టి... అందులో పావుకేజీ చక్కెర వేసి, తగినన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. సన్నటి సెగపైన ఉడికిస్తూ, తిప్పుతూ తీగపాకం వచ్చేలా చేయాలి. తరువాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న పనీర్ ముక్కలను వేసి ఉడికించాలి.
ఇవి ఉడికేలోపు రెండు లీటర్ల పాలను వేరే పొయ్యిమీద పెట్టి వేడి చేసి... అరలీటర్ అయ్యేంతదాకా మరిగించాలి. పాలు బాగా మరిగి అరలీటర్ అయిన తరువాత... పైన మిగిలిన పావుకేజీ చక్కెరను వేయాలి.
ఇప్పుడు ఈ పాల మిశ్రమంలో పైన ఉడికించి ఉంచుకున్న పనీర్ ముక్కలను వేసి.. పైన బాదం, పిస్తా ముక్కలతో అలంకరించాలి. అంతే పనీర్ రస్మలాయి స్వీట్ రెడీ అయినట్లే..! దీన్ని ఫ్రిజ్లో ఉంచి చల్లబడిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది.