చెలరేగిన భారత్: ఐర్లాండ్ చిత్తు... చిత్తు

ప్రపంచ కప్ ట్వంటీ-20లో భారత్ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో క్రికెట్ పసికూన ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. ఐర్లాండ్ విధించిన 113 పరుగుల విజయలక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన భారత్ ఈ టోర్నీలో విజయదరహాసంతో సూపర్-8కు చేరుకుంది.

నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. జహీర్‌ఖాన్ 4 వికెట్లు, ఓజా రెండు వికెట్లు తీసుకుని ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడంతో వారు భారీస్కోరు సాధించడం కష్టమైంది.

ఐర్లాండ్ జట్టులో మూని (19), వైట్ (29)లు కాస్త ప్రతిఘటించి జట్టు పరువు నిలిపారు. అనంతరం 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 15.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్‌శర్మ (52 నాటౌట్), గంభీర్ (37)లు చెలరేగడంతో భారత్ విజయం నల్లేరుమీద నడకలా సాగింది.

వెబ్దునియా పై చదవండి